1857 సిపాయిల తిరుగుబాటు
బ్రిటిషర్లు జాత్యహంకారంతో భారతీయులను కించపరిచారు. భాష,
సంస్కృతి తదితరాల్లో భేదం ఉండటంతో కంపెనీ పాలన ప్రజలకు దూరమై చివరికి
సిపాయిల రూపంలో బ్రిటిషర్లపై విరుచుకుపడింది. ఝాన్సీలక్ష్మీభాయి
వీరత్వాన్ని పాలకులకు రుచిచూపింది. చివరికి తిరుగుబాటు చల్లారినా, బ్రిటిష్
పాలనలో మార్పులు ప్రారంభమయ్యాయి. ప్రథమ భారత స్వాతంత్య్ర పోరాటంగా
విమర్శలు అందుకున్న 1857 సిపాయిల తిరుగుబాటు విఫలం కావడానికి కారణాలు,
తిరుగుబాటు ఫలితాలు మొదలైన అంశాలను వివరంగా తెలుసుకుందాం.
1857 సిపాయిల తిరుగుబాటు ఢిల్లీ, కాన్పూర్, ఔధ్, ఝాన్సీతో
పాటు మరికొన్ని ప్రాంతాల్లో జరిగింది. బీహార్లో జరిగిన తిరుగుబాటుకు
కున్వర్సింగ్, బరేలీలో ఖాన్ బహదూర్, ఫైజాబాద్లో మౌల్వి అహ్మదుల్లా
తిరుగుబాటుకు నాయకత్వం వహించారు.
వైఫల్యం : తిరుగుబాటు
అకస్మాత్తుగా ప్రారంభమై, ఉద్ధృతంగా కొనసాగి, అతి శీఘ్రంగా వ్యాపించి,
విఫలమైంది. ఈ వైఫల్యం వెనుక ఉన్న కారణాలను పరిశీలిద్దాం.
¤ కేంద్రీకృత నాయకత్వం, నాయకుల మధ్య సమన్వయం లేకపోవడం తిరుగుబాటుకు ప్రధాన
నాయకుడు లేకపోవడం, వివిధ ప్రాంతాలమధ్య నాయకులకు సమన్వయం లేకపోవడంతో
తిరుగుబాటు విఫలమైందని చెప్పవచ్చు.
ఉదాహరణకు అయోధ్యలో బేగం హజ్రత్మహల్, మౌల్వి అహ్మదుల్లా మధ్య ఘర్షణ వాతావరణం అక్కడ వైఫల్యానికి కారణమయింది.
¤ తిరుగుబాటు ఒకేసారి అన్ని ప్రదేశాల్లో జరగలేదు. ఒకే పథకం లేకపోవడం కూడా వైఫల్యానికి ఒక కారణం.
¤ దేశవ్యాప్తం కాకపోవడం: తిరుగుబాటు ఉత్తర, మధ్య భారతదేశం దాటిపోలేదు. ఇలా
భారతదేశమంతటా జరగకపోవడం వల్ల తిరుగుబాటును అణచివేయడం బ్రిటిషర్లకు
సులభమైంది.
¤ అన్ని వర్గాలూ పాల్గొనలేదు: స్వదేశీ సంస్థానాధీశుల్లో అందరూ పాల్గొనలేదు.
గ్వాలియర్, నైజాం మొదలైన రాజులు బ్రిటిషర్లకు అండగా నిలిచారు.
'తిరుగుబాటు తుపానులో తుడిచిపెట్టుకుపోబోతున్న బ్రిటిష్ పాలనకు స్వదేశీ
సంస్థానాధీశులు బలమైన అడ్డుగోడగా నిలిచారు' అని, తిరుగుబాటు సమయంలో ఉన్న
వైశ్రాయ్ లార్డ్ కానింగ్ వారిని పొగిడాడు.
¤ ఆధునిక విద్యావంతులు తిరుగుబాటును సమర్థించలేదు. వీరు బ్రిటిష్ ప్రభుత్వం
దేశాన్ని పారిశ్రామిక పెట్టుబడిదారీ విధానం, ఆధునిక రాజకీయ విద్యావిధానాల
ద్వారా ఆధునికీకరించి, అభివృద్ధి చేస్తుందని ఆశించారు.
¤ వర్తకులు, వడ్డీ వ్యాపారులు బ్రిటిష్వారికి మద్దతు పలికారు. బ్రిటిష్
రెవెన్యూ విధానాల ద్వారా లాభపడటం, తిరుగుబాటుదార్ల దాడితో నష్టపోవడంతో
వాళ్లు తిరుగుబాటుదార్లకు సహకరించలేదు.
¤ సిపాయిల్లో అందరూ పాల్గొనలేదు. సిక్కులు, గూర్ఖాలు బ్రిటిషర్లకు మద్దతు పలికారు.
¤ ఆయుధ సంపత్తి, సమర్థులు: అనుభవజ్ఞులైన సైనికాధికారులు, పటిష్ఠమైన సమాచార
వ్యవస్థ బ్రిటిషర్ల విజయానికి తోడ్పడ్డాయి. ఇవి భారతీయులకు లేవు.
¤ తిరుగుబాటుదార్లే బ్రిటిషర్లకు రహస్య సమాచారం అందించడం: బహదూర్షా - II
భార్య జీనత్మహల్ తిరుగుబాటుదార్లపై నమ్మకం లేక, బ్రిటిషర్ల నుంచి తన
కుటుంబాన్ని కాపాడుకునేందుకు, బ్రిటిషర్లకు తిరుగుబాటుదార్ల సమాచారాన్ని
అందించింది.
¤ దూరదృష్టి, ఆధునిక దృక్పథాల లోపం: తిరుగుబాటుదార్లలో భవిష్యత్ భారత్పట్ల
నిర్దిష్ట అభిప్రాయాలు, ప్రణాళికలు మొదలైనవి లేవు. కేవలం తమకు జరిగిన
నష్టాలతో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకమయ్యారు.
తిరుగుబాటు విఫలమైనా తర్వాత జరిగిన భారత స్వాతంత్య్ర సంగ్రామానికి ఇది బీజాలు వేసింది.
తిరుగుబాటు ఫలితాలు : 1857
సిపాయిల తిరుగుబాటు ఆధునిక భారతదేశ చరిత్ర గమనంలో ఒక మైలురాయి. అది
పాలకులకు, తిరుగుబాటుదార్లకు ఎన్నో హెచ్చరికలు, గుణపాఠాలను అందించింది.
¤ బ్రిటిషర్లకు తమ పాలన, కార్యక్రమాలపట్ల ప్రజలు అసంతృప్తితో ఉన్నారనే
విషయం అర్థమైంది. సామ్రాజ్య విస్తరణకంటే అంగీకారం పొందే అధికారం ముఖ్యమని
గుర్తించారు. బ్రిటిషర్లు తమ మనుగడకు, పాలన సుస్థిరతకు విధేయవర్గం
ఆవశ్యకతను గుర్తించారు. దీనికోసం కంపెనీపాలన, బ్రిటిష్ ప్రభుత్వ విధానాలు,
సైనిక వ్యవస్థ మొదలైన ఎన్నో విషయాల్లో మార్పులు తెచ్చారు
.
¤ 1858 భారత ప్రభుత్వ చట్టం: 1858లో బ్రిటిష్ పార్లమెంటు 'యాక్ట్ ఫర్ బెటర్
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా' అనే చట్టాన్ని ఆమోదించింది. దీని ప్రకారం
ఈస్ట్ఇండియా కంపెనీ పరిపాలన రద్దయింది. భారతదేశ పరిపాలనను బ్రిటిష్
ప్రభుత్వమే ప్రత్యక్షంగా చేపట్టింది.
¤ భారతదేశ పరిపాలనా వ్యవహారాలకోసం 'భారత రాజ్య కార్యదర్శి లేదా సెక్రెటరీ
ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా'ను నియమించారు. ఈయనకు సహాయపడటానికి 15 మంది
సభ్యులున్న కౌన్సిల్ ఉంటుంది. ఈయన బ్రిటన్ మంత్రివర్గంలో సభ్యుడు.
క్యాబినెట్ మంత్రి హోదా ఉంటుంది. మొదటి భారత రాజ్యకార్యదర్శి చార్లెస్
ఉడ్స్.
¤ గవర్నర్ జనరల్ పదవిని 'గవర్నర్ జనరల్ అండ్ వైశ్రాయ్' గా మార్చారు.
బ్రిటిష్ పాలిత రాష్ట్రాలకు గవర్నర్ జనరల్ హోదాలో; స్వదేశీ సంస్థానాలపై
బ్రిటిష్ సార్వభౌముడి ప్రతినిధిగా వైశ్రాయ్ హోదాలో వ్యవహరిస్తాడు. మొదటి
వైశ్రాయ్ లార్డ్ కానింగ్.
బ్రిటిష్ ప్రభుత్వ విధానాల్లో మార్పు:
లార్డ్ కానింగ్ 1858 నవంబర్ ఒకటో తేదీన అలహాబాద్లో దర్బార్ ఏర్పాటు
చేశాడు. అందులో స్వదేశీ సంస్థానాలను బ్రిటిష్ సామ్రాజ్యంలో కలపబోమని,
వారితో మైత్రీభావం కొనసాగిస్తామనీ చెప్పారు.
¤ రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని రద్దు చేశారు. దీనివల్ల సంస్థాన పాలకులకు దత్తత స్వీకరించే హక్కు కలిగింది.
¤ సువిశాల దేశాన్ని పాలించడానికి ప్రజల మద్దతు అవసరమని గుర్తించి, అణచివేత
ధోరణికి స్వస్తి చెప్పి, ప్రజాభిప్రాయానికి విలువనివ్వడం ప్రారంభించారు.
¤ మతవిషయాల్లో జోక్యం చేసుకోబోమని చెప్పారు. ఏ జాతికి, మతానికి
చెందినవారైనా విద్య, ప్రతిభ, నిజాయితీ, సమర్థతలే ప్రభుత్వోద్యోగాలకు అర్హత
అని తెలిపారు.
¤ రాజకీయ వ్యవస్థలో దేశప్రజలకు భాగస్వామ్యం కల్పించేందుకు 1861 కౌన్సిల్ చట్టాన్ని ప్రవేశపెట్టారు.
సైనిక వ్యవస్థలో మార్పులు: 1857 తిరుగుబాటుకు సిపాయిలు ప్రధాన కారణమని గుర్తించిన బ్రిటిష్వారు సైనిక వ్యవస్థలో గణనీయ మార్పులు తెచ్చారు.
¤ బెంగాల్లో సిపాయిలు, సైనికుల నిష్పత్తి 2 : 1 గా, బొంబాయి, మద్రాస్లో 3 : 1 గా నిర్ణయించారు. అంతకుముందు ఇది 6 : 1 గా ఉండేది.
¤ తిరుగుబాటు సమయంలో తమకు సహకరించిన గూర్ఖాలు, సిక్కులు, రాజపుత్రులను ఎక్కువ సంఖ్యలో చేర్చుకున్నారు.
¤ శతఘ్నిదళాన్ని పూర్తిగా ఆంగ్లేయుల అధీనంలోకి తీసుకున్నారు.
విభజించు, పాలించు విధానం
హిందు-ముస్లిం సఖ్యతను తమ మనుగడకు ఆందోళనగా భావించి,
విభజించు-పాలించు విధానాన్ని అవలంభించారు. 1857 తిరుగుబాటుకు ముస్లింలు
ప్రధాన కారణమని మొదట ముస్లిం వ్యతిరేక విధానాలు, 1875 తరువాత ముస్లింలను
దగ్గరికి చేరుస్తూ, హిందువులను దూరంగా ఉంచారు. ఇలా హిందు-ముస్లింల మధ్య
విభేదాలు సృష్టించారు.
¤ 1857 తిరుగుబాటు ఒక శకాన్ని ముగించి, మరో వినూత్న శకారంభానికి పునాది
వేసింది. సామ్రాజ్య విస్తరణ శకం స్థానంలో ఆర్థిక దోపిడీ శకం ప్రారంభమైంది.
తిరుగుబాటు స్వభావం: భారతదేశంలో
శతాబ్ద కాలంగా వేళ్లూనుకున్న నిరంకుశ బ్రిటిష్ పాలనకు చరమగీతం పాడేందుకు
భారతీయులు చేసిన ప్రథమ తీవ్ర ప్రయత్నమే 1857 తిరుగుబాటు. ఈ తిరుగుబాటుపై
చరిత్రకారుల్లో పలురకాల అభిప్రాయాలున్నాయి.
జాన్ లారెన్స్, సీలీ: ''1857 సిపాయిల తిరుగుబాటు 'సిపాయిల పితూరీ'
అంతకుమించి ఏమీ కాదు'' అని చెప్పారు. అయితే తిరుగుబాటు సిపాయిల్లో
ప్రారంభమైనా, అన్ని వర్గాల ప్రజలూ పాల్గొన్నారు. సిపాయిల్లో కూడా అందరూ
పాల్గొనలేదు. కాబట్టి, వారి వాదన సరైంది కాదని అనిపిస్తుంది.
టి.ఆర్.హోమ్స్: 1857 తిరుగుబాటు 'నాగరితకకు అనాగరికతకు మధ్య జరిగిన
సంఘర్షణ' అన్నారు. ఈ వివరణలో సంకుచిత జాతిదురహంకారం వ్యక్తమవుతుంది. కారణం,
బ్రిటిషర్లు, భారతీయులు ఇరువురూ అనాగరిక చర్యలకు పాల్పడ్డారు. ఉదాహరణకు
ఢిల్లీ, కాన్పూర్, లక్నోల్లో సిపాయిలు అరాచక చర్యలకు పాల్పడితే,
బ్రిటిషర్లు ఢిల్లీ, బెనారస్లలో కిరాతక చర్యలకు పాల్పడ్డారు. హడ్సన్, నీల్
అవలంబించిన మార్గాలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయి.
బెంజిమన్ డిజ్రేలి: 1857 తిరుగుబాటును జాతీయ తిరుగుబాటుగా ఈయన అభివర్ణించాడు.
ఇది కేవలం తూటాలకు కొవ్వు పూయడంవల్ల వచ్చిన క్షణికావేశపు
తిరుగుబాటు కాదని వందేళ్లుగా ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అణచివేతకు
గురైన ప్రజలు సాగించిన పోరాటమని చెప్పారు.
వి.డి.సావార్కర్: స్వాతంత్య్ర
సమరయోధుడైన వి.డి.సావార్కర్ సిపాయిల తిరుగుబాటును 'ప్రణాళికాబద్ధమైన ప్రథమ
జాతీయ స్వాతంత్య్ర సంగ్రామం' అని వర్ణించాడు. అయితే ఆర్.సి.మజుందార్
అభిప్రాయాల ప్రకారం అది వాస్తవం కాదని తెలుస్తుంది.
¤ 1857 తిరుగుబాటుకంటే ముందుగానే 1806లో వేలూరు, 1824లో బారక్పూర్లో సిపాయిల తిరుగుబాట్లు జరిగాయి.
¤ భారతజాతి అంతా తిరుగుబాటులో పాల్గొనలేదు.
¤ స్వాతంత్య్రం కంటే తాము పోగొట్టుకున్న ప్రాంతాలు పొందడానికి తమకు జరిగిన అన్యాయాలను ఎదిరించడానికి తిరుగుబాటు చేశారు.
¤ ఈ కారణాలను వివరిస్తూ తిరుగుబాటు ప్రణాళికాబద్ధంగా జరగలేదని మజుందార్ పేర్కొన్నారు.
ప్రముఖ వ్యక్తులు
బహదూర్షా -II: చిట్టచివరి మొగల్
చక్రవర్తి. సిపాయిల తిరుగుబాటులో ఢిల్లీలో నాయకుడు. తిరుగుబాటుదార్లు
ఆయనను భారతదేశ చక్రవర్తిగా ప్రకటించారు. అయితే బ్రిటిషర్లు రంగూన్ జైలుకు
పంపగా, అక్కడే మరణించాడు.
నానాసాహెబ్: ఈయన అసలు పేరు
దొండూపంత్. చివరి పీష్వా బాజీరావు- II కు దత్తపుత్రుడు. కాన్పూర్లో
తిరుగుబాటుకు నాయకత్వం వహించాడు. తరువాత నేపాల్ పారిపోయాడు.
తాంతియా తోపే: ఈయన అసలుపేరు రామ
చంద్ర పాండురంగ. గెరిల్లా యుద్ధంలో ఆరితేరినవాడు. నానాసాహెబ్, ఝాన్సీ
లక్ష్మీభాయిలకు తిరుగుబాటు సమయంలో తోడ్పాటు అందించాడు. మాన్సింగ్ చేసిన
ద్రోహం వల్ల బ్రిటిషర్లకు పట్టుబడ్డాడు. బ్రిటిషర్లు ఈయనను ఉరితీశారు.
భక్తఖాన్: మీరట్లో తిరుగుబాటుకు నాయకుడు. ఢిల్లీలో తిరుగుబాటుకు వాస్తవ నాయకుడిగా వ్యవహరించాడు.

